బీహార్, జూలై 5: రాష్ట్రంలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ స్వయంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. రాజ్యసభకు ఎన్నికైన నితిన్ నబీన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో బంకీపూర్ స్థానం ఖాళీ కాగా, అక్కడ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ఒక్క స్థానంలో కూడా విజయం నమోదు చేయకపోవడంతో, ఈసారి ఆయన నేరుగా ఎన్నికల బరిలోకి దిగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవడంతో పాటు పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన పోటీ చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బంకీపూర్తో పాటు బీహార్లోని మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 30న పోలింగ్ నిర్వహించనుండగా, అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రశాంత్ కిషోర్ అభ్యర్థిత్వంతో బంకీపూర్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది.