తమిళనాడు: ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాతూర్లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొని ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సభలో మాట్లాడిన చంద్రబాబు, దేశ అభివృద్ధి కోసం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) పాలన కీలకమని పేర్కొన్నారు. తమిళనాడు అభివృద్ధి కూడా ఎన్డీఏ చేతుల్లోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. “ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తే అది కేవలం రాజకీయ విజయం కాదు… తమిళ ప్రజల విజయంగా నిలుస్తుంది” అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై మాట్లాడిన చంద్రబాబు, 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో విధ్వంసకర పాలన జరిగిందని విమర్శించారు. “మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభమైంది. అభివృద్ధి దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం” అని తెలిపారు.
తమిళనాడులోని చెన్నై నగరంపై కూడా ఆయన విమర్శలు చేశారు. “గత ఐదేళ్లుగా చెన్నై అభివృద్ధి శూన్యంగా ఉంది. అంతర్జాతీయ స్థాయి నగరంగా ఎదగాల్సిన చెన్నై స్థిరంగా నిలిచిపోయింది” అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రసంగంలో కేంద్ర-రాష్ట్ర సమన్వయం, అభివృద్ధి రాజకీయాలు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలు ప్రధానంగా నిలిచాయి. తమిళనాడులో ఎన్డీఏకు ప్రజలు మద్దతు ఇస్తే రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సభకు భారీగా ప్రజలు హాజరుకావడం గమనార్హం. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తమిళనాడులో ప్రధాన పార్టీల మధ్య ప్రచారం మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది.