- మమతా బెనర్జీకి భారీ షాక్, భవానీపూర్‌లో సువేందు అధికారి విజయం

కలకత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దేశ రాజకీయాలను కుదిపేసే సంచలన పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఆమెపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నేత సువేందు అధికారి 15,114 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించినట్లు ఫలితాలు వెల్లడించాయి.  భవానీపూర్ నియోజకవర్గం మమతా బెనర్జీకి రాజకీయ కోటగా భావించబడేది. కోల్‌కతా నగరంలో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి గతంలోనూ ఆమె విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని కొనసాగించారు. అయితే ఈసారి అదే నియోజకవర్గంలో బీజేపీ బలమైన సవాల్ విసిరి, మమతాను ఓడించడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. సువేందు అధికారి గత ఎన్నికల్లోనూ నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై విజయం సాధించారు. ఆ ఎన్నిక తర్వాత మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి ఉపఎన్నికలో గెలిచి తిరిగి అసెంబ్లీలోకి ప్రవేశించారు. ఇప్పుడు మరోసారి మమతా సొంత బలమైన స్థావరంగా భావించిన భవానీపూర్‌లోనే సువేందు అధికారి గెలవడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ ఫలితంతో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లినట్లు సమాచారం. టీఎంసీకి ఇది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. మమతా బెనర్జీ ఓటమి తర్వాత తదుపరి రాజకీయ పరిణామాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి పదవి, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై త్వరలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.